కర్నూలు (ఆంధ్రప్రదేశ్) : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం సంకల్భాగ్ ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ ఉన్నారు.
నేటి నుంచి డిసెంబర్ 1వరకు.. 12 రోజులపాటు తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. ఐదువేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.లక్షలాది భక్తజనం కోసం జిల్లాలో 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో వీఐపీ పుష్కర ఘాట్తో పాటు 7 ఘాట్లు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 నిబంధనల మేరకు నదిలో అధికారులు స్నానాలకు అనుమతి ఇవ్వలేదు. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానం చేసి పూజలు, పిండ ప్రదానాలు చేసుకోడానికి ఏర్పాటు చేశారు.
పుష్కర్ -
పంచభూతాల్లో నీరు సకల జీవకోటికి ఆధారం. నదులను దేవతా స్వరూపాలుగా భావించడం ఆచారం. పన్నెండు రాశుల్లో గ్రహాల సంచారాన్ని పరిగణలోకి తీసుకొని పుష్కరాలను నిర్ణయిస్తుంటారు. గ్రహాల్లో దేవతల గురువుగా పేర్కొనే బృహస్పతి గమనానికి పట్టే సమయం పన్నెండేళ్లు. అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ మొత్తం పన్నెండు సంవత్సరాల్లో రాశిచక్రాన్ని చుట్టి వస్తాడు. అలా బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. అంటే బృహస్పతి అడుగిడిన రాశికి సన్నిహిత ప్రాంతంలోని జీవనదికి ఆ ఏడాది పుష్కరాలు ఉంటాయి.
గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సింధు, ప్రణీత అనే పన్నెండు నదులు పుష్కర ప్రవేశగల పుణ్యతీర్థాలుగా ప్రసిద్ధి పొందాయి. బృహస్పతి మకర రాశిలో ప్రవేశిస్తున్న కారణంగా తుంగభద్ర నదికి శుక్రవారం నుంచి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. ఈ ఏడాదిలో మొదటి పన్నెండు రోజులు ‘ఆది పుష్కరాలు’ అని, చివరి పన్నెండు రోజులు ‘అంత్య పుష్కరాలు’ అని వ్యవహరిస్తారు.
పౌర సరఫరాల మంత్రి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ను తీవ్రంగా విమర్శించారు
ఎపిఎస్ఆర్టిసి - కార్తీక్ మాసంలో 1,750 బస్సులను నడపాలని నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ పెద్ద చర్యలు తీసుకుంటుంది