కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన గొబ్బరు వెంకటరమణ, జయలక్ష్మి దంపతుల మొదటి సంతానం గొబ్బరు ప్రవీణ్(27), రెండో సంతానం ప్రదీప్. వీరంతా కూరగాయల సాగు చేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రవీణ్కు ఇదే పంచాయతీ కందివలసకు చెందిన మార్కొండ రామచంద్ర, చిన్నమ్మడు దంపతుల కుమార్తె రోజాతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. రామచంద్ర కొన్నాళ్ల కిందట బతుకు జీవనం కోసం కుటుంబ సభ్యులతో ఏలూరు వెళ్లిపోయారు. ప్రవీణ్ పండిన కూరగాయాలను బొబ్బిలి మార్కెట్కు బొలేరో వాహనంలో మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో డ్రైవర్తో కలిసి తీసుకువెళ్లేందుకు బయలుదేరాడు
మార్గంలో సీతానగరం మండలం ఎన్సీఎస్ సుగర్స్ వద్ద కింతలిపేట రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని బొలేరో ఢీకొంది. దీంతో బొలేరోలో ప్రయాణిస్తున్న ప్రవీణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రవీణ భార్య ఆరు నెలల గర్భిణి. ప్రవీణ్ పెద్ద కొడుకు కావడంతో కుటుంబ జీవనంలో తన వంతు పాత్ర పోషిస్తూ తల్లిదండ్రులతో పాటు తమ్ముడు ప్రదీప్, భార్య రోజాను తనకు కలిగినంతలో హ్యాపీగా చూసుకుంటున్నాడు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.