అమరావతి: నంద్యాల్లో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఒక వ్యక్తి తన భార్య, బిడ్డలతో కలిసి ఉసురు తీసుకొన్నాడు అంటే ఎంతటి ఒత్తిడిని, మానసిక వేదనను అనుభవించి ఉంటాడో అందరం అర్థం చేసుకోవాలన్నారు. ఒక కేసు విచారణలో సలాం, అతని భార్యను పోలీస్స్టేషన్కు పిలిచిన నేపథ్యంలో ఈ ఆత్మహత్య చోటు చేసుకుందని తెలిపారు.
సలాం కుటుంబమంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిందెవరు? అందుకు కారణమైనవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గితే ఇలాంటి పరిస్థితులే వస్తాయని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతల చేతుల్లో ఆయుధాలుగా మారితే క్షేత్ర స్థాయి పోలీసులే ఇరుకునపడతారని హెచ్చరించారు. వారి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.