ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

అమరావతి: గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ దిశగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తలపెట్టిన సంక్షేమ మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగేందుకు గ్రామాల్లో ప్రశాంతత అవసరమన్నారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సిన ఎన్నికల కమిషన్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. ఎన్నికల పేరుతో పల్లెల్లో కక్షలు రగిల్చేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని, ప్రలోభాలకు గురిచేస్తే కఠినంగా శిక్షించే చట్టాలను ప్రభుత్వం తెచ్చిందని గుర్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మంగళవారం మాట్లాడారు.

గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందుకే ఈ పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. కొత్త నాయకత్వానికి అవసరమైన అన్ని సదుపాయాలూ సీఎం ఇప్పటికే సమకూర్చారు. మహాత్ముడు కోరుకున్న గ్రామ స్వరాజ్యం రావాలంటే పంచాయతీ ఎన్నికలు అవసరమే. అయితే ఇవి పట్టుదల, కక్షలకు కారణమవుతున్నాయి. గ్రామ ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితి రాకూడదని ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకే పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తోంది. 

గ్రామాభివృద్ధిని కాంక్షించే స్వచ్ఛంధ సంస్థలు, మేధావులు, రాజకీయ పార్టీలూ పట్టుదలకు పోకుండా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. ఏకగ్రీవ ఎన్నికలు జరిగే పంచాయతీలకిచ్చే ప్రోత్సాహాకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెంచింది. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహిస్తాం. అన్ని పార్టీలూ దీనికి సహకరించాలని కోరుతున్నాం. గ్రామాల్లో పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుకుని ఏకగ్రీవం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

పంచాయతీ ఎన్నికల చట్టంలో అనేక మార్పులు తెచ్చాం. ఎన్నికల సమయాన్ని తగ్గించాం. హింస, ప్రలోభాలకు పాల్పడితే అనర్హత వేటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష  పడుతుంది. ఎన్నికైన తర్వాత కూడా ఆరేళ్లపాటు పోటీ చేసే అవకాశం ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సగంలో ఆపేసి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తెరమీదకు తెచ్చిన ఎన్నికల కమిషన్‌పై మాకు అనుమానాలున్నాయి. ఆయన మాటల్లోనూ దురుద్దేశం ఉందనేది స్పష్టమైంది. గత మార్చిలో ఏకగ్రీవాలు సమ్మతమన్న ఎన్నికల కమిషనర్‌ ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగే పంచాయతీలను ఓ చూపు చూడాలని హెచ్చరించడం వింతగా ఉంది. 60 ఏళ్లుగా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని అంతా కోరుకున్నారు. ఏకగ్రీవాల కోసం ప్రోత్సాహకాలూ ఇస్తున్నారు. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మాట్లాడటం విచారకరం.

ఎస్‌ఈసీ ఉద్దేశాల వెనుక ప్రతిపక్ష టీడీపీ ఉందనే అనుమానం కలుగుతోంది. పల్లెల్లో కక్షలు రెచ్చగొట్టి, వర్గాలుగా చీల్చే కుట్ర కోణం ఉందనే సందేహాలొస్తున్నాయి. దేవాలయాల్లో  మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన ఈ పార్టీ ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొట్టాలనే దుర్భుద్దితో ఉందని తెలుస్తోంది. డబ్బు, మద్యం ద్వారా నీతిమాలిన వ్యవహారాలు చేస్తే కఠిన శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలి. రెచ్చగొట్టే మాటలు విని యువత బలి కావద్దు. ముఖ్యంగా టీడీపీ నేతల తప్పుడు మాటలు ఏమాత్రం వినొద్దు. జీవితాలను పాడు  చేసుకోవద్దు. గ్రామాల్లో కక్షలకు కారణం కావద్దు. 

 ఇది కూడా చదవండి:

టాండావ్ వివాదం: ఎఫ్ఐఆర్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు చేరిన మేకర్స్ బృందం

హైదరాబాద్‌కు చెందిన అమాయకుడు కరెంట్‌లో చేతులు, కాళ్లు కోల్పోయాడు

బర్త్ డే స్పెషల్: ఈ సినిమాతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న రియా సేన్

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -