సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై చీఫ్ జస్టిస్కు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై చర్చ జరగాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్న లోపాలపై లేఖలు రాయడం కొత్తేమీ కాదని.. 1961లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చంద్రారెడ్డిపై అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు
జస్టిస్ ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదని.. 2005లో రిటైర్డ్ జడ్జి బీఎస్ఏ స్వామి న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాసిన పుస్తకంలో జస్టిస్ రమణ గురించి ఒక పేరాలో ప్రస్తావించారని వివరించారు. చంద్రబాబు హయాంలో రమణ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారన్నారని గుర్తుచేశారు.
అలాగే, రాజధాని భూబాగోతంలో జరుగుతున్న దర్యాప్తుపై రాష్ట్ర హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం సరికాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వారిపై ఏమన్నా మాట్లాడితే కోర్టులు ఒప్పుకోవనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందన్నారు. జడ్జీలు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నారు. హైకోర్టులో రాష్ట్ర డీజీపీతో ఐపీసీ సెక్షన్–151 చదివించారని, అంత అవసరమా? మేం రాష్ట్ర ప్రభుత్వం కన్నా బలవంతులమని చెప్పాలనుకుంటుందా అని ఉండవల్లి ప్రశ్నించారు. లెజిస్లేచర్కు, జ్యుడీషియరీకి ఉన్న సంబంధం చెడిపోతే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ఉండవల్లి తెలిపారు.
జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవాలంటే పార్లమెంట్లో అభిశంసన జరగాలన్నారు. ఇది ఆమోదం పొందాలంటే లోక్సభలో వంద మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీల మద్దతు అవసరమన్నారు. సీఎం వైఎస్ జగన్ కేసులపై ఆయన స్పందిస్తూ.. వీటిల్లో ఆయనకు శిక్షపడే అవకాశం లేదన్నారు.
ఇది కూడా చదవండి:
మెగా ఫ్యామిలిలో పెళ్లి సందడి ,నిహారిక-చైతన్యల వివాహం
గొప్ప స్మార్ట్ టివి కేవలం ఈ ధరవద్ద మాత్రమే లభ్యం అవుతుంది, దీని ఫీచర్లు ఏమిటో తెలుసుకోండి.