భర్త అంత్యక్రియలకు ఆరురోజుల పసికందుతో యువతి హాజరు,పాడె మోసిన సోదరి

భర్త అంత్యక్రియలకు ఆరురోజుల పసికందుతో యువతి హాజరు కావడం కలకడలో ఆదివారం విషాదాన్ని నింపింది. ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతిని విధి చిన్నచూపు చూసింది. ప్రమాదంలో గాయపడిన భర్త ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటాడని ఎదురు చూసిన భార్య కు విగతజీవుడై రావడంతో చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. కలకడవాసులను కళ్లు చెమర్చిన ఈ ఘటన వివరాలు .. కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన పి.గంగాధర (25) శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికాగా, శనివారం తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే దుఃఖాన్ని మింగుకుని తల్లిదండ్రులు ఈ విషయం కోడలు మంగమ్మతో చెప్పకుండా దాచారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడని నమ్మబలికారు. ఆదివారం భర్త మృతదేహం ఇంటికి చేర డంతో మంగమ్మ చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. భర్త లేని జీవితం తనకు వద్దంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. ఆరు రోజుల పసికందుతో భర్త అంత్యక్రియల్లో పాల్గొంది. మూడు కిలోమీటర్లు నడచి సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని చెల్లెలు భవాని  శ్మశానం వరకు నలుగురిలో ఒకరుగా మోసింది. ఈ దృశ్యాలు కలకడవాసుల కలచివేశాయి

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -