తిరుపతి : ‘పబ్జీ’ యువతను పిచ్చెక్కిస్తోంది. వారి జీవితాలతో ఆడుకుంటోంది. చివరకు ప్రాణాలను సైతం అలవోకగా తీసుకునేలా ప్రేరేపిస్తోంది. ఎందరో తల్లిదండ్రుల ఉసురుపోసుకుంటోంది. ప్రభుత్వం నిషేధించినా ఇంకా వెర్రితలలు వేస్తూనే ఉంది. పిల్లలు ఈ గేమ్ జోలికి వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక నవాబ్పేటలో నివాసం ఉంటున్న ఓ యువకుడు పబ్జీకి బానిసయ్యాడు. మూడు నెలల క్రితం లాక్డౌన్ సమయంలో పూట జరగడమే కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులు పనికి వెళ్లని పురమాయించారు. గేమ్కు దూరం కావాల్సి వస్తుందని ఆ యువకుడు ఇంటి గేటుకి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.
మొన్న పోకెమాన్.. నిన్న బ్లూవేల్.. తాజాగా పబ్జీ (ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్గ్రౌండ్) యువతను ప్రత్యేకించి స్కూలు విద్యార్థులను వెర్రెక్కిస్తున్న ప్రమాదకర ఆన్లైన్ మొబైల్ గేమ్. మరీ గంటల తరబడి ఈ ఆటలో మునిగితేలుతున్నారు. ఈ గేమ్ను ప్రభుత్వం బ్యాన్ చేసినా, వివిధ సర్వర్ల ద్వారా పలువురు ఆడుతుండడం గమనార్హం.