తిరుమలలో గత నెలలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే ఈ నెల 16 నుంచి 24 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై అభయ ఆహ్వాన నరసింహస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం.
ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
ఇది కూడా చదవండి:
ఇంకా శాంతించని కృష్ణమ్మ ,నీటితో తొణికిసలాడుతున్న బ్యారేజీలు
సీఎం వైఎస్ జగన్ లేఖపై చర్చ జరగాల్సిందేనని అన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్